ఏపి లో ఔట్ సోర్సింగ్ (పొరుగు సేవల) ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తుందంటూ ప్రచారం జరగడం ఆ ఉద్యోగుల్లో ఆందోళనలు రేకెత్తించింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న 17 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుండి తొలగించారు. పదేళ్లలోపు సర్వీసు ఉన్న వీరికి ఈ నెల 1న వీరి తొలగింపునకు మెమో జారీ చేసింది. అదే విధంగా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వసతి గృహాల్లో పనిచేస్తున్న దాదాపు 350 మంది వంట కార్మికులు, కమాటీలు, సహాయకుల్ని తొలగిస్తూ తాజాగా నిన్న ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో మిగతా విభాగాల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.40 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తుండగా, వీరిలో లక్ష మందిని ఆప్కాస్ విభాగంలోకి తీసుకురాగా, మిగతా 1.40 లక్షల మంది ఇంకా ఏజెన్సీలు, థర్డ్ పార్టీల ద్వారా విధులను నిర్వహిస్తున్నారు. వీరిలో పదేళ్లలోపు సర్వీసు ఉన్న వారు సుమారు 60 వేల మంది వరకు ఉన్నారు.
ఆప్కాస్లో చేరిన వారిలో 17 మందిపై ప్రభుత్వం వేటు వేయగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ఆదేశాలను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయా సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించే ప్రసక్తిలేదని ఆయన చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నామని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. పలువురు ఉద్యోగుల తొలగిస్తూ అధికారుుల ఆదేశాలు ఇవ్వడంపై సీఎం జగన్ ఆగ్రహాం వ్యక్తం చేశారనీ, ఆ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించారని సజ్జల తెలిపారు.
మరో పక్క ..ప్రభుత్వంలోని అనేక శాఖలలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు, సెక్రెటరీ జనరల్ వైవీ రావు, ఆంధ్రప్రదేశ్ కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ కే సుమన్, సెక్రెటరీ జనరల్ డి భానోజీ రావు లు సైతం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడగా, అటువంటిది ఏమి లేదని చెప్పారన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు జారీ చేసిన మెమోను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరినట్లు తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ లో ఏదైనా ప్రత్యేక కారణాలు ఉంటే, అందులో పని చేసే పోరుగుసేవల ఉద్యోగులను మరొక శాఖలో సర్దుబాటు చేయాలి తప్ప ఇలా తొలగించాలని మెమో ఇవ్వడం భావ్యం కాదని వారు తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?