AP PRC: పీఆర్సీపై ప్రభుత్వోద్యోగులు చేస్తున్న ఉద్యమం విషయంలో ఏపీ ప్రభుత్వం ‘తగ్గేదే..లే’ అంటోంది. ఉద్యోగులు కూడా అదే మాట. ఎవరూ తగ్గడం లేదు. అయితే.. సమ్మె కార్యాచరణ ప్రకటించి ప్రస్తుతానికి నిరసనలు చేస్తున్న ఉద్యోగులు ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లబోతున్నారు. ప్రభుత్వం కమిటీ వేసి ఉద్యోగ సంఘాలను చర్చలకు రావాలని.. సమస్య జటిలం కాకుండా పరిష్కారం కావాలని ప్రయత్నిస్తున్నా.. ఉద్యోగస్తులు ససేమిరా అంటున్నారు. 1986 లో సీఎంగా ఎన్టీఆర్ కూడా ఉద్యోగస్తులు సమ్మెకు వెళ్తే 19 రోజుల తర్వాత మెట్టు దిగి ఉద్యోగస్తులతో చర్చించి సమస్య పరిష్కారం అయ్యేలా చేశారు. చంద్రబాబూ, వైఎస్ కూడా ఉద్యోగస్తుల డిమాండ్లు దాదాపు నెరవేర్చారు. అయితే.. జగన్ మాత్రం ఈ అంశంలో కాస్త ఖచ్చితంగా ఉన్నట్టు చెప్పాలి.
ఆ విషయంలో వెసులుబాటు..
ఇలా ఇద్దరూ తగ్గకపోవడం రాష్ట్రానికీ, ప్రభుత్వానికీ, ప్రజలకూ మంచిది కాదు. ఎవరొకరు తగ్గాలి. ఇప్పుడు ప్రభుత్వం ఒక అడుగు ముందడుగు వేస్తోందని తెలుస్తోంది. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాటల ప్రకారం.. హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులకు ప్రభుత్వం ఇస్తానన్న 8 శాతం హెచ్ఆర్ఏ ను 12 శాతం చేసేందుకు ఆలోచిస్తోందని శ్రీకాంత్ రెడ్డి మాటల ద్వారా తెలుస్తోంది. పీఆర్సీ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదిలేదనే చెప్తున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో హెచ్ఆర్ఏ ఒకటి. కాబట్టి.. ఈ విషయంలో ఉద్యోగులు అంగీకరిస్తే.. ప్రభుత్వం సవరణలకు సిద్ధమయినట్టే. అయితే.. ఉద్యోగులు మాత్రం తమకు ఈ పీఆర్సీ వద్దు.. పాత జీతాలే ఇవ్వాలని డిమాండ్ చేయడం.. వారిద్దరి మధ్య టాగ్ ఆఫ్ వార్ కొనసాగుతోంది.
పరిష్కారమయ్యేనా..
క్షేత్రస్థాయిలో ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వ పథకాలు, ప్రజల పనులు, ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఉద్యోగులు సమ్మెకే వెళ్తే.. ఓవైపు జిల్లాల పునర్విభజన, సంక్షేమ పథకాల అమలు, పాలన అన్నీ ఫిబ్రవరి 7 తర్వాత పరిస్థితులు మరింత జటిలమవుతాయి. ఇప్పటికే ఉద్యోగస్తులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం, ఉద్యోగులు ఒక్కో మెట్టు దిగి సమస్య పరిష్కరించుకుంటారో లేదో చూడాలి. అయితే.. ప్రభుత్వం హెచ్ఆర్ఏపై పునరాలోచిస్తుందనే వార్తల నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో ఈ అంశంపై ఓ క్లారిటీ రానుందని చెప్పాలి.