AP Govt: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఖాతాల్లో నిధులు రాత్రికి రాత్రే మాయం అయి పోయాయి. గతంలో 14,15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.7,660 కోట్లు విద్యుత్ బకాయిలకు తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల అయిన నిధులను గ్రామ పంచాయతీలకు తెలియకుండా ప్రభుత్వం తీసేసుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాల సర్పంచ్ లు ఆందోళన చేశారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం వరకూ వెళ్లడంతో కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ప్రత్యేకంగా పంచాయతీలు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలని ఆదేశించింది. ఆ మేరకు అధికారులు కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ప్రత్యేకంగా అకౌంట్లు ఓపెన్ చేశారు.
AP Govt: సర్పంచ్ లు దిగ్భాంతి
అయితే ఇప్పుడు పంచాయతీల జనరల్ ఫండ్స్ కూడా జీరో బ్యాలెన్స్ చూపడంతో సర్పంచ్ లు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే జనరల్ ఫండ్స్ ను కూడా తీసేసుకుందని కొందరు సర్పంచ్ లు అనుమానం వ్యక్తం చేస్తుండగా, కార్యదర్శులు మాత్రం సాంకేతిక లోపం కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇయర్ ఎండింగ్ కావడం వల్ల సాంకేతిక సమస్యతో బ్యాలెన్స్ జీరో చూపిస్తోందని, ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని కొందరు కార్యదర్శులు ఆశాభావంతో ఉన్నారు.
రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీల్లోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేసిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ముందుగా ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు చెప్పకుండా రాత్రికి రాత్రే నిధులు తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో 14,15 ఆర్ధిక సంఘం నిధులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ జనరల్ ఫండ్స్ కూడా కాజేసిందని అన్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్ లు అందరూ పంచాయతీ ఖాతాలను చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.