AP GOVT: ఏపి సీఎంఓలో గత కొంత కాలం క్రితం వరకూ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ అన్ని శాఖలపై ఆయనే పెత్తనం చెలాయించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. తన కంటే సీనియర్ అధికారులను సైతం గౌరవించే వారు కాదనీ, ఆయన మాటే చెల్లుబాటు అయ్యే విధంగా చూసుకున్నారనీ, ఆయనను వ్యతిరేకించిన సీఎస్ నే శంకరగిరి మాన్యానికి పంపిన చరిత్ర ఉందని అందరూ అనుకునే వారు. గతంలో సీఎస్ గా పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటుకు ఆయనే కారణం అని కూడా సచివాలయ వర్గాల్లో పెద్ద చర్చ కూడా జరిగింది. ఆయన వ్యవహార శైలిపై పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయనను కీలక బాధ్యతల నుండి తప్పించారని అప్పట్లో ప్రచారం జరిగింది.
AP GOVT: సీఎంఓలో అధికారులకు శాఖలు కేటాయింపు ఇలా..
ఇటీవల ప్రవీణ్ ప్రకాష్ ను సీఎంఓ నుండి ఢిల్లీ ఏపి భవన్ కు బదిలీ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో టీటీడీ ఇఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న మరో సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ ప్రకాష్ మాదిరిగానే స్పెషల్ సీఎస్ హోదాలో జవహర్ రెడ్డి కూడా సీఎంఓ వ్యవహారాలు అన్నీ పర్యవేక్షిస్తారని అందరూ భావించారు. అయితే జవహర్ రెడ్డితో పాటు సీఎంఓలో ఉన్న ముగ్గురు ఐఏఎస్ లకు స్పష్టమైన బాధ్యతలను కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం…జవహర్ రెడ్డికి జీఏడీ, హోం, రెవెన్యూ, అటవీ, పర్యావరణ, వైద్య ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంఓ ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెసిడ్యూవల్ తదితర శాఖలను కేటాయించారు.
సీఎం కార్యదర్శిగా ఉన్న సాల్మన్ ఆరోఖియారాజ్ కు పౌరసరఫరాలు, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు కేటాయించారు. సీఎం మరో కార్యదర్శిగా ఉన్న ధనుంజయరెడ్డికి ఆర్ధిక, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయ, అనుబంధ రంగాలు, మున్సిపల్ పరిపాలన, ఇంధన, యువజన సర్వీసులు, మార్కెటింగ్ అండ్ సహకార శాఖలు కేటాయించారు. సీఎం అడిషనల్ సెక్రటరీ గా ఉన్న రేవు ముత్యాలరాజుకు ప్రజా ప్రతినిధుల వినతులు, రెవెన్యూ (ల్యాండ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్), హౌసింగ్, రవాణా, రోడ్లు, భవనాలు, కార్మిక, స్కిల్ డెవలప్ మెంట్ శాఖలను కేటాయించారు.