AP govt Employees Associations: పీఆర్సీతో సహా పలు డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుండి సానుకూల హామీ లభించింది. దీంతో తమ ఉద్యమానికి ఉద్యోగ సంఘాలు విరామం (వాయిదా) ప్రకటించారు. నిన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో దాదాపు ఆరు గంటలకు పైగా చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నేతలు నేడు మంత్రి బుగ్గనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మతో భేటీ అయ్యారు. పీఆర్సీ సహా ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన 71 అంశాలపై చర్చించారు. బుధవారం సీఎస్ సమీర్ శర్మ తో కూడిన కార్యదర్శుల కమిటీ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకుంటుందనీ, తానే స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి బుగ్గన ఉద్యోగ సంఘాల నేతలకు హమీ ఇచ్చారు. ఉద్యోగులు తమ ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మల నుండి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ లభించడంతో ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు.
AP govt Employees Associations: మంత్రి బుగ్గన ఏమన్నారంటే…
ఉద్యోగ సంఘాల నేతలతో పెండింగ్ అంశాలపై చర్చించాం. ఇరు జేఏసీల నేతలతో మాట్లాడాం, కోవిడ్ సహా వివిధ అంశాల వల్ల ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఆలస్యం అయ్యింది. ప్రభుత్వం అనే కుటుంబంలో ఉద్యోగులు ఒక భాగం. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను దశవారిగా పరిష్కరిస్తాం. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాం అని తెలిపారు.
తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించి 71 అంశాలపై కూలంకుషంగా చర్చించామనీ, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వ హామీతో ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 7వ తేదీ నుండి ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.