ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి .. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఈ నెల 2వ తేదీ (గురువారం) విశాఖకు బయలుదేరుతున్నారు. 3,4వ తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెన్టర్స్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ కు ముందే సుప్రీం కోర్టు నుండి అమరావతి రాజధాని కేసుపై సానుకూల స్పందన వస్తుందని ఏపి ప్రభుత్వం భావించింది. అందుకే ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్స్ సదస్సులో ఏపి సీఎం వైఎస్ జగన్ .. విశాఖ రాజదాని అవుతోందనీ, తాను త్వరలో అమరావతి నుండి విశాఖకు మకాం మార్చి అక్కడి నుండే పరిపాలన సాగించనున్నారని తెలిపారు. అయితే సుప్రీం కోర్టులో అమరావతి కేసు వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సుప్రీం కోర్టుకు లేఖ రాసింది. ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీ త్వరితగతిన విచారణ జరపాలని కోరింది.
అమరావతి కేసు గత నెల 23వ తేదీన విచారించాల్సి ఉండగా, ఒక సారి నోటీసు అయిన అంశాలను బుధ, గురువారాల్లో విచారించబోమని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్న కారణంగా విచారణకు రాలేదు. దీంతో మొన్న సోమవారం నాడు ఏపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి .. జస్టిస్ కెఎం జోసప్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమరావతి పిటిషన్లు 23వ తేదీన విచారణకు రానందున కోర్టుకు హోలీ సెలవుల అనంతరం వెంటనే విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ జేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం జోక్యం చేసుకుని వాదనలకు ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించింది. ఒక రోజు సమయం పడుతుందని నిరంజన్ రెడ్డి బదులు ఇవ్వగా, విచారణను మార్చి 28వ తేదీన విచారిస్తామని పేర్కొంది.
అయితే మళ్లీ రెండు రోజుల వ్యవధిలోనే ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపుతట్టింది. ఏపి రాజధాని అమరావతి పిటిషన్ లకు సంబంధించి ఏపి హైకోర్టు తీర్పుపై వెంటనే విచారణ చేపట్టాలని గురువారం ఉదయం ధర్మాసనం ముందు ప్రస్తావించనుంది. ఈ విషయంపై రైతుల తరపు న్యాయవాదులకు ఏపి ప్రభుత్వ లాయర్లు ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపారు. జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనంలో కొత్తగా జస్టిస్ అమానుల్ల చేరారు. జస్టిస్ అమానుల్ల గతంలో ఏపి హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. దీంతో గురువారం ప్రభుత్వ తరపు న్యాయవాది విజ్ఞప్తిపై ధర్మాసనం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తకరంగా మారింది. ఇప్పటికే ఈ నెల 28వ తేదీ విచారణ చేస్తామని ప్రకటించిన ధర్మాసనం.. ఏపి ప్రభుత్వ తాజా విజ్ఞప్తిపై విచారణ తేదీ మార్పు చేస్తుందా..? లేదా అనేది గురువారం మధ్యాహ్నానికి తేలనున్నది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ టూర్ షెడ్యూల్ ఇలా.. ఈ సారి ఫ్రత్యేకత ఏమిటంటే..?