IPS ABV: ఇప్పటికే సస్పెన్షన్ లో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ఏపి సర్కార్ మరో షాక్ ఇచ్చింది. గత నెలలో పెగాసెస్ పై దుమారం రేగిన నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయలేదంటూ ఆయన మీడియా సమావేశంలో వివరించడంతో పాటు తన సస్పెన్షన్ పైనా మాట్లాడారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించడంపై ఏపి సర్కార్ సీరియస్ అయ్యింది. మీడియాతో మాట్లాడటంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
IPS ABV: అనుమతి లేకుండా మీడియా సమావేశం నిర్వహించడం తప్పే
ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం నిర్వహించడం తప్పేనని నోటీసులో పేర్కొంది. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ లోని 6వ నిబంధనను పాటించకుండా ఏబి వెంకటేశ్వరరావు మీడియా సమావేశం పెట్టడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. మెమో అందిన వారం రోజుల లోగా వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఏపి వెంకటేశ్వరరావు మీడియా సమావేశం పెట్టిన మరుసటి రోజే ఈ నోటీసు జారీ చేసినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏబి వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనను వివిధ అభియోగాలపై సస్పెండ్ చేసింది. సుమారు రెండేళ్ల నుండి ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన సస్పెన్షన్ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో ఉంది.