AP Govt: ఏపిలో సరిహద్దు రాష్ట్రాలతో పోల్చుకుంటే మద్యం ధరలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు మందు బాబులకు అవసరమైన బ్రాండ్ లు లభించకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం రవాణా ఎక్కువగా జరుగుతోంది. ఓ పక్క తెలంగాణ, మరో పక్క కర్ణాటక, అటు తమిళనాడు రాష్ట్రాల నుండి సరిహద్దు జిల్లాలకు అక్రమంగా మద్యం రవాణా జరుగుతోంది. దాదాపు ఏడాది కాలంగా చెక్ పోస్టుల వద్ద తనిఖీల్లో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల మద్యం పట్టుబడుతోంది. రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నప్పటికీ వేరువేరు మార్గాల ద్వారా రాష్ట్రానికి మద్యం సరఫరా అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్రమ మద్యం రవాణా అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం పన్ను విధానంలో కీలక మార్పులకు సర్కార్ చర్యలు చేపట్టింది. మద్యం పన్ను రేట్లలో మరో సారి మార్పులు చేసింది. వ్యాట్, ఎక్సైజ్ పన్ను, ప్రత్యేక మార్జిన్ ల అంశంలో హేతుబద్దత తీసుకువచ్చింది. హేతుబద్దత ద్వారా మద్యం ధరలు తగ్గుతాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రజిత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు.
AP Govt: తగ్గనున్న మద్యం ధరలు
తాజాగా జారీ చేసిన ప్రభుత్వ ఆదేశాలతో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బ్రాండ్ల పై 5 నుండి 12 శాతం ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇతర అన్ని కేటగిరిలపై 20 శాతం వరకూ ధరలు తగ్గుతాయని రజిత్ భార్గవ పేర్కొన్నారు. వచ్చే వారం నుండి రాష్ట్రంలో ప్రముఖ సంస్థల బ్రాండ్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. అక్రమ మద్యం రవాణా, నాటు సారా తయారీ అరికట్టేందుకే ధరలు తగ్గింపునకు చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం చర్యల వల్ల రాష్ట్రంలో 37 శాతం మద్యం వినియోగం తగ్గిందని పేర్కొన్న ఆయన మద్యం అక్రమ రవాణా నిరోధించడానికే మద్యం ధరలు తగ్గిస్తున్నామని రజిత్ భార్గవ వివరించారు.
వైన్ షాపుల్లో ఇక బ్రాండెడ్ మద్యం అమ్మకాలు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో మద్యం దుకాణాల నిర్వహకుల వ్యాపారానికి గండి పడనుంది. ప్రస్తుతం ఏపిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో గతంలో లభించిన బ్రాండెడ్ మద్యం లభించకపోవడంతో మద్యం ప్రియులు పొరుగు రాష్ట్రంలో సరిహద్దు గ్రామాల నుండి కొనుగోలు చేస్తున్నారు. మరో పక్క ప్రభుత్వ మద్యం షాపుల్లో లభిస్తున్న మద్యం బ్రాండ్ లపై ప్రతిపక్షాల నుండి, మందు బాబుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపిలో మద్యం ధరలు గతంలో కంటే అధికంగా ఉండటంతో ప్రభుత్వంపై మందు బాబులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మందు బాబుల్లో అసంతృప్తి తొలగిపోనుంది.