AP Govt: జగన్మోహనరెడ్డి సర్కార్ మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించింది. ఇప్పటి వరకూ డిప్యూటి సీఎం నారాయణ స్వామి ఆధీనంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖను ప్రభుత్వం తప్పించింది. ఈ కీలక శాఖను ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డికి అప్పగించారు. ఈ మార్పుతో ఇక నుండి డిప్యూటి సీఎం నారాయణ స్వామి ఆధీనంలో ఎక్సేజ్ శాఖ మాత్రమే ఉంటుంది. వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్ర నాధ్ కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు,
AP Govt: డిప్యూటి సీఎం నారాయణ స్వామి నుండి వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గనకు బదిలీ
ఆర్ధిక శాఖ పరిధిలోకి వాణిజ్య పన్నులు, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను తీసుకువెళ్లాలని గతంలోనే ప్రభుత్వం భావించింది. అయితే అప్పట్లో దానిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. అయితే అప్పటి ప్రతిపాదనల్లో ఉన్న వాణిజ్య పన్నల శాఖను ఆర్ధిక శాఖలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే షన్ కు సంబంధించి ఇంకా ప్రభుత్వ నిర్ణయం వెలువడలేదు. ఈ శాఖను ఆర్ధిక శాఖలో విలీనం చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రస్తుతం మరో డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణ దాస్ ఆధీనంలో ఉంది,. ఈ శాఖను ధర్మాన కృష్ణదాస్ నుండి తప్పించి ఆర్దీక శాఖలో విలీనం చేస్తే ధర్మాన పరిధిలో రెవెన్యూ శాఖ మాత్రమే ఉంటుంది.
శాఖల మార్పుతో కొత్త మంత్రులకు పోర్టుపోలియోలు
సీఎం వైెఎస్ జగన్ ప్రస్తుతం ఉన్న మంత్రులను పూర్తిగా మార్చి కొత్త వారితో మంత్రివర్గం ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాలు కీలకంగా మారాయి. మంత్రుల శాఖలో మార్పుల అనంతరం దాని ఆధారంగానే కొత్త మంత్రులకు ఫోర్టుపోలియోలు కేటాయించనున్నారు. ఆదాయ పరంగా కీలక శాఖలపై వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలో ఉండటం మేలన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ధిక శాఖ మంత్రి అసెంబ్లీ అసెంబ్లీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. నూతన మార్పుల వల్ల ఆర్ధిక శాఖకి పని భారం, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్ధిక మంత్రి పరిధిలో ఉన్న శాసనసభా వ్యవహారాలను విస్తరణలో భాగంగా న్యాయశాఖతో కలిపి కేటాయిస్తారనే మాట వినబడుతోంది. డిసెంబర్ 8 నాటికి ప్రస్తుత మంత్రులు బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తి అవుతుంది. దీంతో డిసెంబర్ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ దీనిపై కసరత్తు ప్రారంభించారని సమాచారం.