Breaking: ఏపి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉద్యోగులపై నమోదైన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసుల సమీక్షకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది ఏపి ప్రభుత్వం. 2014 నుండి 2019 కాలంలో కొందరు ఉద్యోగులపై కక్షసాధింపులో భాగంగా ఏసీబీ కేసులు పెట్టారని ఉద్యోగ సంఘాల నుండి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో నమోదు అయిన ఏసీబీ కేసులను సమీక్షించాలని ఉద్యోగ సంఘం కోరింది. ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నారంటూ పలువురు ఉద్యోగులపై కేసులు నమోదు చేయడంతో పాటు నాడు అరెస్టులు కూడా జరిగాయి. ట్రాప్ కేసులు మినహా అదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నారన్న అభియోగాలతో నమోదు అయిన కేసులను ఈ హైపవర్ కమిటీ సమీక్షించనుంది.
జనంలో ఉన్న వారికే ఎన్నికల్లో సీట్లు .. మరో సారి స్పష్టం చేసిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్
అయిదుగురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీని జగన్ సర్కార్ నియమించింది. ఇండ్రస్టీస్ అండ్ కామర్స్ సెక్రటరీ, హోం శాఖ కార్యదర్శి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, లా డిపార్ట్ మెంట్ సెక్రటరీ లతో పాటు కేసులు నమోదైన డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారి ఈ హైపవర్ కమిటీ లో ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. ఉన్నతాధికారులతో ఏర్పాటైన హై పవర్ కమిటీ 2014 నుండి 2019 వరకూ నమోదైన ఆదాయానికి మించి ఆస్తుల కేసులను సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తమపై కక్షపూరితంగా కేసులు నమోదు చేశారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిని సమీక్షిస్తామని గతంలో హామీ ఇచ్చామని, ఆ హామీ మేరకే ఆ కేసుల సమీక్షించేందుకు ఈ హైపవర్ కమిటీని నియమించడం జరిగిందని ప్రభుత్వం పేర్కొంది.
పేర్ని, బుగ్గనలకు సీఎం జగన్ ఊహించని షాక్..మ్యాటర్ ఏమిటంటే ..?