రాజధాని కేసులు తక్షణమే విచారించాలని కోరుతూ సుప్రీం కోర్టు రిజిస్ట్రారుకు ఏపి సర్కార్ లేఖ రాసింది. రాజధాని పిటిషన్లను వెంటనే మెన్షన్ లిస్టులో చేర్చాలని సుప్రీం కోర్టులోని అడ్వకేట్ ఆన్ రికార్ట్స్ మెహవూజ్ నజ్కీ రిజిస్ట్రార్ కు సర్కార్ లేఖ పంపింది. ఈ నెల 6వ తేదీ (సోమవారం) ఉదయం మెన్షన్ లిస్టులో చేర్చాలని నజ్కీ రిజిస్ట్రారు ను అభ్యర్ధించింది ఏపీ సర్కార్. ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అమరావతిపై మళ్లీ చట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి శానసనాధికారం లేదని పేర్కొన్న విషయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు.

రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ వ్యాజ్యంలో నవంబర్ 28వ తేదీన జరిగిన విచారణలో ఈ ఏడాది జనవరి 31వ తేదీకి వాయిదా వేసిన విషయం విదితమే. అయితే జనవరి 31న బెంచ్ సమావేశం కాకపోవడంతో విచారణ జరగలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) ను ఈ నెల 6వ తేదీన మెన్షన్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వెంటనే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.
ఏపి సర్కార్ దాఖలు చేసిన ఎస్ఎల్పీ విచారణ దశలో ఉండగానే రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో వారం రోజుల క్రితం మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ పిటిషన్ దాఖలు చేశారు. ఒకే చోట అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని శివరామకృష్ణ కమిటీ సూచించిన విషయాన్ని పిటిషన్ లో ప్రస్తావించారు. రెండు నెలల్లో విశాఖ రాజధానిగా పరిపాలన సాగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలోనే ఢిల్లీలో జరిగిన ఏపి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహాక సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ త్వరలో విశాఖ రాజధాని అవుతుందనీ, తాను కూడా విశాఖకు షిప్ట్ అవుతున్నట్లుగా కీలక ప్రకటన చేశారు. సుప్రీం కోర్టు నుండి అనుకూలంగా తీర్పు రావడం గానీ లేక మధ్యంతర ఉత్తర్వులు వెలువరిస్తే వెంటనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
నిన్న రిమాండ్ .. నేడు బెయిల్ మంజూరు