AP Govt: ఏపిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎపిలోని జగన్ సర్కార్ కీలక అడుగు వేసింది. ప్రముఖ ఆన్ లైన్ లెర్నింగ్, ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బేజూస్ తో ఏపి సర్కార్ ఒప్పందం చేసుకుంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, బైజూస్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్ పాలసీ హెడ్ సుస్మిత్ సర్కార్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రనాథ్ అమెరికా నుండి వర్చువల్ పద్దతిలో పాల్గొన్నారు. ఇటీవల దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంలో బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజూ రవీంద్రన్ తో సీఎం జగన్ సమావేశమైయ్యారు. అప్పుడే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ఇ లెర్నింగ్ కార్యక్రమంపై జగన్ చర్చించగా, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రవీంద్రన్ తెలియజేశారు. ఈ చర్చల ఫలితంగా నేడు బైజూస్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం కారణంగా కొందరికే పరిమితమైన ఎడ్యుకేషనల్ టెక్నాలజీ విద్య ఇకపై ఏపి ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు కూడా అందుబాటులోకి రానుంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP Govt: ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు ఉచితంగా బైజూస్ ఎడ్యుకేషన్
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ఒక అతి పెద్ద మైలురాయి వంటి ఘట్టంగా అభివర్ణించారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్ధులు బైజూస్ ఎడ్యుకేషన్ ను పొందాలంటే ఒక్కో విద్యార్ధి రూ.20వేల నుండి రూ.24వేలు ఏడాదికి చెల్లించాల్సి ఉంటుందనీ, ఇప్పుడు బైజూస్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు ఉచితంగా అందుబాటులోకి వస్తొందని అన్నారు సీఎం జగన్. నాల్గవ తరగతి నుండి పదవ తరగతి వరకూ బైజూస్ ఎడ్యుకేషన్ కు అనుగుణంగా టెక్స్ బుక్స్ లో మార్పులు తెస్తామన్నారు. ఒప్పందం కుదిరింది ఈ రోజే కాబట్టి వచ్చే ఏడాది నుండి బైజూస్ కంటెంట్ కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు రూపొందిస్తామని తెలిపారు. ఈ ఏడాది పాఠ్య పుస్తకాలు ఇప్పటికే ప్రింట్ అయ్యాయనీ, వచ్చే ఏడాది పాఠ్యపుస్తకాలు ద్విభాషల్లో (తెలుగు, ఇంగ్లీ) ఉంటాయని జగన్ వెల్లడించారు.
ఈ ఏడాది 4.70 లక్షల మంది విద్యార్ధులకు ట్యాబ్ లు
దృశ్య మాధ్యమం ద్వారా బోధన కొరకు ప్రతి తరగతి గదిలో టీవీ ఏర్పాటు చేయడం ద్వారా విజువల్, డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి వస్తుందన్నారు. నాడు – నేడు లో భాగంగా ఈ టెలివిజన్ లు ఏర్పాటవుతాయని చెప్పారు. 8,9,10 తరగతులు విద్యార్ధి దశలో చాలా కీలకమనీ, అందుకే విద్యాపరంగా వారి ఎదుగుదలకు 8వ తరగతిలో అడుగుపెట్టే విద్యార్ధులకు ట్యాబ్ లు అందజేస్తామని సీఎం జగన్ తెలిపారు. సీబీఎస్ఈ పరీక్షలు పాస్ అయ్యేందుకు ఇది ఎంతగనో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ఏడాది 4.70 లక్షల మంది విద్యార్ధులకు ట్యాబ్ లు ఇవ్వనున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి విజయకుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.