AP Govt: కరోనా కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూదేలన సంగతి తెలిసిందే. సినీ రంగ సమస్యలపై రాష్ట్రంలో ఇటీవల పెద్ద ‘వార్’యే జరిగింది. యాక్టర్ నుండి పొలిటీషియన్ గా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మువీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో సినీ రంగ సమస్యలను ప్రస్తావిస్తూ ఏపి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించడం, దానిపై ఏపి మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కౌంటర్ అటాక్ చేయడం తెలిసిందే. ఈ దుమారం నేపథ్యంలో సినీ నిర్మాతలు మంత్రి పేర్ని నానిని కలిసి పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఆ నిర్మాతలే పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ విషయాలపై చర్చించారు.
AP Govt: ధియేటర్ లలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి
కాగా సినీ రంగ సమస్యలకు సంబంధించి నిర్మాతలు ఇచ్చిన విజ్ఞఫ్తిపై ఏపి సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఏపి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలు సినీ రంగానికి బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు అయ్యింది. ఏపిలో సినిమా హాళ్లను వంద శాతం అక్యుపెన్సీతో నిర్వహించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు (14వ తేదీ) నుండి సినిమా హాళ్లను వంద శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చని జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం రాష్ట్రంలో సినిమా థియేటర్ లను ఓపెన్ చేసినప్పటికీ..50 శాతం ఆక్సుపెన్సీతోనే సినిమా హాళ్లు నడుస్తున్నాయి.
నాలుగు ప్రదర్శనల ఆంక్షలు ఎత్తివేత
కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో పొరుగు రాష్ట్రం తెలంగాణలో నూరు శాతం ఆక్యుపెన్సీతో ధియేటర్ లు నడుస్తున్నాయి. ఏపిలోనూ నూరు శాతం అక్యుపెన్సీతో ధియేటర్ లు నడుపుకునేందుకు అవకాశం కల్పించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వంద శాతం ఆక్యుపెన్సీతో నడుపుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రోజుకు నాలుగు ప్రదర్శనలపై ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దసరా పండుగకు పలు పెద్ద సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినీ రంగానికి పెద్ద ఊరటను ఇచ్చినట్లు అయ్యింది. కాగా వంద శాతం ఆక్యుపెన్సీ తో ధియేటర్ లు నడిపినా కరోనా నియంత్రణ చర్యలు తప్పని సరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ఆయా సంస్థల ప్రతినిధులు ఏపి సీఎం వైఎస్ జగన్, మంత్రి పేర్ని నానిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.