Night Curfew: ఏపిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుండి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను వాయిదా వేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ తరువాత ఈ నెల 18వ తేదీ నుండి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైట్ కర్ఫ్యూపై ముందుగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. సంక్రాంతి పండుగ వేళ వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వగ్రామాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారనీ, వారికి ఇబ్బందులు కలగకూడదనే కర్ఫ్యూ వాయిదా వేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాకు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు బహిరంగ ప్రదేశాలలో విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. మాస్క్ లు ధరించకపోతే రూ.100లు జరిమానా విధిస్తారని చెప్పారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిన్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వ్యాపార సంస్థల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోతే రూ.10వేల నుండి రూ.25వేల వరకూ జరిమానా విధంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సినిమా హాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నిర్వహించాలని ఆదేశించారు. ఆర్టీసి సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణీకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. మరో పక్క వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇస్తున్నారు.