AP Govt: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మూలంగా ప్రతి నెలా ఒకటవ తేదీన అందరు ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ బట్వాడా చేయలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోటు అయిదు డీఏలు పెండింగ్ ఉన్నాయి. ఉద్యోగులు పిఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చిన సీపీఎస్ రద్దు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల పై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన బాట పట్టాలని భావించాయి. అయితే ఉద్యోగులలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పొగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నాలను ప్రారంభించారు. ఉద్యోగ సంఘాల నేతల నిన్న సజ్జలకు కలిసి తమ డిమాండ్ల పై వినతి పత్రం సమర్పించగా, ఆయన వెంటనే స్పందించి నేడు ఉద్యోగ సంఘాల నేతలు, సీఎంఒ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపి ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపి జఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులకు సంబంధించి మొత్తం పది సమస్యలను ప్రభుత్వానికి వివరించారు.
Read More: MAA: ‘మా’ ఎన్నికల్లో అక్రమాలు..? ఎన్నికల అధికారి వివరణ ఇదీ..!!
AP Govt: నెలాఖరులోగా పీఆర్సీ
సమావేశం అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలును ఉద్యోగులు తమ భుజస్కందాలపైనే వేసుకున్నారని అన్నారు. ఉద్యోగుల భద్రత విషయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రెండడుగులు ముందే ఉంటారని తెలిపారు. ఉద్యోగులకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కశ్చితంగా వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రెండేళ్లుగా కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందనీ, దీంతో కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పిఆర్సీ వంటి సమస్యలపై చర్చలు జరుగుతున్నాయనీ, ఈ నెలాఖరులోగా పీఆర్సీ పూర్తి చేస్తామనీ, మిగిలిన విషయాలను కూడా క్రమపద్దతిలో చేస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ హామీని సీఎం జగన్ నెరవేర్చారని గుర్తు చేశారు. అదే విధంగా ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటివి ఎన్నో కార్యక్రమాలు చేశామని అన్నారు.
జీతాలు ఆలస్యం చేయం
“ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం లేదు, ఎటువంటి అపొహాలు వద్దు, ఎవరు ఏమి చెప్పినా నమ్మోద్దు, జీతాల విషయంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ డిమాండ్ల పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం జగన్ చొరవతోనే చర్చలు జరిగాయనీ, డిమాండ్ లపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా పీఆర్సీ అమలు చేస్తామని సీఎంఓ హమీ ఇచ్చిందన్నారు.