AP Govt: ఏపీలో ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వంగా పరిస్థితులు మారిపోయాయి. కొత్త పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు భగ్గుమంటున్నారు. దీనిపై సీఎస్ వివరణ ఇచ్చినా ఉద్యోగులు చల్లబడలేదు. గతంలో ఎన్నడూ జరగని అన్యాయం ఇప్పుడు జరిగిందని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు (ఫ్యాప్టో) జిల్లా కలెక్టరేట్లను ముట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉద్యోగ సంఘాలు రేపు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా సమస్య మరింత జటిలమవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేసే ఆలోచన లేనట్టుగానే ఉంది.
ఉద్యోగ సంఘాలు అలా..
ప్రభుత్వానికి ఉద్యోగులూ, ప్రజలూ ఇద్దరూ ముఖ్యమే. వైసీపీ (AP Govt) ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోందనేది నిజం. పాదయాత్రలో ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలను సీఎం అయ్యాక నవరత్నాలు పేరుతో నెరవేరుస్తున్నారు. అయితే.. ఇదే పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పీఆర్సీ ప్రకటించక ముందు వచ్చిన జీతమే బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎస్ వివరణ ఇచ్చినా ఉద్యోగులు తమ లెక్కలు పక్కాగా చెప్తున్నారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ ఇవ్వడం ఎప్పుడూ జరగలేదని అంటున్నారు. మొత్తంగా తమ జీతం తగ్గుతుందని ఉద్యోగ సంఘాలు.. తగ్గవని ప్రభుత్వం చెప్తోంది. అయితే.. ఉద్యోగుల ఆందోళనలతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా.. అనేది ప్రశ్నగా మారింది.
ప్రభుత్వం ఇలా..
రాష్ట్రం ఆర్ధికలోటులో ఉన్నా.. ఆదాయం తక్కువగా ఉన్నా.. అప్పులు చేసి మరీ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది (AP Govt) ప్రభుత్వం. పైగా.. కరోనా పరిస్థితుల్లో కూడా ప్రజలకు పథకాలు అందించడంతో వెనకడుగు వేయలేదు. దీంతో కొన్ని వర్గాల్లో ప్రభుత్వంపై సానుభూతి ఉంది. ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదే. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు అడిగినంత ఇస్తే.. సంక్షేమ పథకాలు అమలు ఇబ్బంది అవుతుంది. కాబట్టి.. ఇద్దరినీ కలుపుకుని వెళ్లాలనేది జగన్ ఆలోచన. అయితే.. సంక్షేమ పథకాల అమలుకు అడ్డురాని ఆర్ధికలోటు.. తమ జీతాలకు ఎందుకు అనేది ఉద్యోగుల మాట. మొత్తంగా సంక్షేమానికే తాము కట్టుబడి ఉన్నామనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వైసీపీ ప్రభుత్వం లబ్ది పొందుతుందనే చెప్పాలి.