AP Govt: ఏపి ప్రభుత్వం (AP Govt) యడాపెడా జీవోలు విడుదల చేయడం, ఆ తరువాత అవి న్యాయ సమక్షలో నిలదొక్కుకోలేని పరిస్థితి ఏర్పడటంతో వాటిని వెనక్కు తీసుకోవడం పరిపాటిగా మారింది. పలు జీవోలను హైకోర్టు (High Court) కొట్టివేస్తున్న నేపథ్యంలో తుది తీర్పు వచ్చే వరకూ వేచి ఉండకుండానే ప్రభుత్వమే ఇప్పుడు సదరు జివోలను, ఉత్తర్వులను విత్ డ్రా చేసుకుంటున్నట్లు కోర్టుకు చెప్పేస్తోంది. గతంలోనే సీఎం జగన్మోహనరెడ్డి (CM YS Jagan Mohan Reddy) జీవోల జారీ సమయంలోనే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఇంతకు ముందు ప్రభుత్వం జారీ చేసిన అనేక జీవోలను హైకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో 59ని ప్రభుత్వం నేడు విత్ డ్రా చేసుకుంది.
AP Govt: మహిళా పోలీస్ జీవో విత్ డ్రా
గ్రామ, వార్డు కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్దమంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. సదరు జివోను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ విషయంలో డ్రైస్ కోడ్ సైతం ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. మహిళా పోలీస్ సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందనీ, దీనిపై పూర్తి వివరాలతో అపిడవిట్ దాఖలు చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు మరో వారానికి వాయిదా వేసింది.