నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసు విషయంలో ఏపి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమర్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు కోర్టులో గతంలో జరిగిన చోరీ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం అయ్యింది. నాల్గవ అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు తాళాలను పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి కేసుకు సంబంధించి పత్రాలను, ఇతర పరికరాలను చోరీ చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేసిన కేసుకు సంబంధించి ఆధారాలను దొంగలు తీసుకువెళ్లారు.
ఈ కేసును రాష్ట్ర పోలీసులు సరైన దిశగా దర్యాప్తు చేయడం లేదని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక అధారంగా హైకోర్టు సుమోటో పిల్ గా పరిగణించి విచారణ చేపట్టింది. కేసును సీబీఐకి అప్పగించినా తమకు అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ (ఏజీ) గతంలో హైకోర్టుకు తెలిపారు. అదే విధంగా ఏ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించినా తమకు అభ్యంతరం లేదని మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి కూడా కోర్టుకు గతంలోనే తెలిపారు. గురువారం ఈ కేసు విచారించిన హైకోర్టు .. సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి నిందితుడుగా ఉన్న కేసు విచారణ కీలకదశకు చేరుకున్న తరుణంలో దానికి సంబంధించి ముఖ్యమైన దస్త్రాలు, పత్రాలు, ఆధారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏకంగా న్యాయస్థానం నుండే చోరీ కావడం నాడు రాష్ట్రంలో తీవ్ర సంచలనం అయ్యింది. మరో పక్క హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి తెలిపారు.
ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు బిగ్ షాక్ .. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు..