AP High court: ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా టికెట్ రేట్ల విషయంలో తెలుగు సినీ ఇండస్ట్రీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ, బెనిఫిట్ షోలను నిషేదిస్తూ ఏపి ప్రభుత్వం జీవో నెంబర్ 35ను తీసుకువచ్చింది. టికెట్ ధరల విషయంలో పునరాలోచన చేయాలని మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులు ఏపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుండి స్పందన లభించలేదు. ఈ నేపథ్యంలో ధియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వం జారీ చేసిన జీవో 35పై హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జివోను రద్దు చేసింది. పాత విధానంలోనే టికెట్ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు ఉందని కోర్టు తెలిపింది.
AP High court: జివో 35ను రద్దు చేసిన హైకోర్టు
కొత్త సినిమాలు వచ్చినప్పుడు టికెట్ ధరలను పెంచుకునే హక్కు ధియేటర్లకు ఉందని పిటిషన్ల తరపు న్యాయవాది వాదించారు. సినిమా బడ్జెట్ కు అనుగుణంగా టికెట్ ధరలను నిర్ణయించుకునే అధికారం ధియేటర్ల యాజమాన్యంకు ఉందని పిటిషన్ల తరపు న్యాయవాది వివరించారు. పిటిషన్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు టికెట్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జివో 35ను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. హైకోర్టు తీర్పుపై జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుంది. హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే హైకోర్టు తీర్పు తెలుగు సినీ ఇండస్ట్రీకి బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు అయ్యింది. త్వరలో భారీ బడ్జెట్ సినిమాలైన ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, పుష్ప వంటి మువీలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైకోర్టు నుండి సానుకూలమైన తీర్పు రావడం వారిలో ఆనందాన్ని కల్గిస్తోంది.