AP High Court: ఏపి రాజధాని అమరావతి కేసులపై హైకోర్టులో రోజు వారి విచారణ కొనసాగుతోంది. పిటిషనర్ల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. అమరావతి రాజధానికి సంబంధించి కీలక అంశాలను న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రాజధాని అమరావతి కోసం రైతులు జీవనోపాధిని త్యాగం చేశారనీ, రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం వెలకట్టలేని త్యాగాలను చేశారని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. వీలైనంత త్వరగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని అన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన న్యాయబద్దమైన హామీలు ప్రస్తుత ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని పేర్కొన్నారు. రైతులు భూములు ఇచ్చింది రాష్ట్ర అభివృద్ధి కోసమనీ, అయితే రాజకీయ విధ్వేషంతో అమరావతిని ప్రభుత్వం ఘోస్ట్ క్యాపిటల్ గా మార్చేసిందని న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు.
కేసు విచారణ సందర్భంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మరో మారు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కేసు హైకోర్టులో పెండింగ్ మూలంగా రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయినట్లు కనబడుతోందని నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరో పక్క త్రిసభ్య ధర్మాసనంలో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులను తప్పించాలన్న ప్రభుత్వ న్యాయవాది వాదనలను సీజే తోసి పుచ్చారు. నేటి విచారణ సందర్భంలోనూ సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 30వేల మంది రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారంటే అమరావతి రైతుల రాజధాని కాదనీ, ఏపి ప్రజలందరి రాజధాని అని సీజే మిశ్రా అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు అంటే వాళ్ల కోసం పోరాడటం మాత్రమే కాదనీ, దేశ ప్రజలందరి కోసం పోరాటం చేశారని విచారణ సందర్భంగా సీజే గుర్తు చేశారు.