AP High court: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజును ఏపి సీఐడీ అధికారులు నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రఘురామ కృష్ణం రాజుతో పాటు ఏబీఎన్, టీవీ 5 ఛానల్ పై ఏపి సీఐడీ సుమోటాగా దేశద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అయితే రఘురామకృష్ణం రాజు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించింది. అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు బెయిల్ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసులో జోక్యం చేసుకోలేమని తెలిపింది.
గత కొన్ని నెలలుగా రఘురామ కృష్ణం రాజు ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రఘురామ కృష్ణం రాజు రచ్చబండ కార్యక్రమాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 లో ప్రత్యేక ప్రాధాన్యతతో ప్రసారాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ.. రఘురామ కృష్ణం రాజుతో పాటు ఏబీఎన్, టీవీ 5 ఛానల్స్ పైనా 124 (దేశ ద్రోహం), 153 ఏ) వివిధ సమూహాల మధ్య శత్రుత్వం పెంచడం), 505 (రెచ్చగొట్టడం), రెడ్ విత్ 120 బీ (నేరపూరిత కుట్ర) సెక్షన్ లతో కేసు నమోదు చేసింది.