మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ఏపి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. వివేకా హత్య కేసులో నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై గత కొద్ది నెలలుగా హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ వ్యాజ్యంలో హతుడు వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఇంప్లీడ్ అయిన సంగతి తెలిసిందే. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షాలను బెదిరించే అవకాశం ఉందంటూ సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తరుపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఈ కేసులో అప్రూవర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాగ్మూంలం ఆధారంగా ఈ కేసులో శివశంకరరెడ్డి ప్రమేయం ఉందనే విషయం నిర్ధారణ అయ్యిందని సీబీఐ న్యాయవాది కోర్టుకు వివరించారు. శివశంకరరెడ్డి జైలులో ఉండగానే సాక్షులను బెదిరింపులకు గురి చేస్తున్నారనీ, హత్యలో అతని ప్రమేయం ఉన్నట్లుగా సీబీఐ దాఖలు చేసిన రెండో చార్జిషీటు ద్వారా తెలుస్తొందని సునీత తరపు న్యాయవాది గతంలోనే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. వీరి బెయిల్ కు సంబందించి తాము వివేకా కుమార్తె సునీత ఆందోళనను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ముగ్గురి బెయిల్ పిటిషన్ లను ధర్మాసనం కొట్టేసింది.
వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే నిందితుల తరపు వారు ఆరోపణలు చేయడం, ఓ అధికారిపైనే కేసు నమోదు చేయడం లాంటి ఘటనల నేపథ్యంలో దీన్ని సీరియస్ గా తీసుకుంది. వివేక కేసులో ఇప్పటికే బెయిల్ పై ఉన్న ఎర్ర గండిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కూడా సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పైే తొలుత సీబీఐ .. ఏపి హైకోర్టును ఆశ్రయించగా సీబీఐ అభ్యర్ధనను తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సీబీఐ సుప్రీం లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.