AP High Court: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి బిగ్ షాక్ తగిలింది. వివేకా హత్య కేసులో ఏ 1 నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. గతంలో ఎర్ర గంగిరెడ్డిని వివేకా హత్య కేసులో ఘటనా స్థలంలో సాక్షాధారాలు మాయం చేశారన్న అభియోగంపై సిట్ అరెస్టు చేసింది. ఆ తరువాత అతను బెయిల్ పై విడుదల అయ్యారు. ప్రస్తుతం గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Read More: YS Viveka Case: వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్..! రూ.40 కోట్ల సుపారీపై రంగంలోకి ఈడీ..!?
AP High Court: సీబీఐ పిటిషన్ డిస్మిస్
సాక్షులను గంగిరెడ్డి బెదిరిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. విచారణ సమయంలో పలువురు నిందితులు ముందుగా నేరం అంగీకరించి తరువాత మాట మార్చారనీ, గంగిరెడ్డి బెదిరించడం వల్లనే వారు మాటమార్చినట్లుగా సీబీఐ పేర్కొంది. నిందితుడి తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు. సాక్షులను బెదిరించారు అనేందుకు సీబీఐ సాక్షాలు చూపడం లేదని నిందితుడి తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సీబీఐ పిటిషన్ ను కొట్టేసింది.
AP High Court: ఆధారాలు చూపలేకపోయిన సీబీఐ
ఇంతకు ముందు కూడా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుత విచారణ సమయంలో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించాడా.. ? సాక్షులను బెదిరించాడా..? వాటిని సంబంధించి అధారాలు ఏమైనా ఉన్నాయా..? అని హైకోర్టు సీబీఐని ప్రశ్నించారు. వీటికి సంబంధించి అధారాలు ఏమైనా ఉంటే వాటిని కోర్టు ముందు ఉంచాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ వారు చేసిన అభియోగాలకు సంబంధించి ఆధారాలు చూపకపోవడంతో హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టేసింది.