AP High Court: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ఏపి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. హత్య కేసులో నిందితుల్లో ఒకడైన వివేకా డ్రైవర్ దస్తగిరి సీబీఐకి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. అయితే దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ నిందితులు ఉమాశంకరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు. ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు వారి పిటిషన్లను కొట్టేసింది. కాగా దస్తగిరి నేరాంగీకార పత్రంలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ వివేకా హత్యకు జరిగిన కుట్రను దస్తగిరి వివరించారు.
AP High Court: మళ్లీ ప్రారంభమైన విచారణ
మరో పక్క వైఎస్ వివేకా హత్య కేసులో విచారణను రెండు రోజుల క్రితం నుండి మళ్లీ ప్రారంభించారు. పులివెందులలో సోమవారం ముగ్గురు అనుమానితులను విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ అనుమానితుడు సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేస్తూ కడప అడిషనల్ ఎస్పీకి నిన్న ఫిర్యాదు అందజేశారు. ఇంతకు ముందు కూడా ఇద్దరు సీబీఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వివేకా హత్య కేసులో పాత్రదారులుగా అనుమానిస్తున్న వారిని అరెస్టు చేసిన సీబీఐ.. సూత్రధారులకు సంబంధించి ఆధారాల కోసం దర్యాప్తును వేగవంతం చేశారు.