ఇప్పటం కేసులో పిటిషన్లకు హైకోర్టులో మరో సారి చుక్కెదురు అయ్యింది. ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు వ్యవహారంలో కోర్టును మోసం చేయడంపై 14 మంది పిటిషన్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఇంతకు ముందు సింగిల్ బెంచ్ కోర్టు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పిటిషనర్లు హైకోర్టులో సవాల్ చేస్తూ రిట్ అప్పీల్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్లు దాఖలు చేసిన రిట్ అప్పీల్ ను ధర్మాసనం బుధవారం డిస్మిస్ చేసింది.
పిటిషనర్లు అంతా రైతులేననీ, వాళ్లకు తెలియక తప్పు చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ వాళ్లకు తెలియకపోతే మీరు చదువుకున్న వారే కదా మీకు తెలియదా అని పిటిషనర్ల తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేయడం మంచిది కాదని హైకోర్టు తెలిపింది.
ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా గత నెలలో ఇళ్లు, ప్రహరీ గోడలను అధికారులు కూల్చి వేశారు. అయితే వీరికి గతంలోనే అధికారులు నోటీసులు జారీ చేశారు. అధికారులు నోటీసులు జారీ చేసిన విషయాన్ని హైకోర్టుకు తెలియకుండా, పిటిషన్ దాఖలు చేసి మద్యంతర ఉత్తర్వులు పొందారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంలో అక్కడి వారికి రోడ్డు విస్తరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ చేసిన విషయాన్ని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దీంతో కోర్టును తప్పుదోవపట్టించినందుకు పిటిషనర్ల పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 14 మంది పిటిషనర్లకు లక్ష వంతున జరిమానా విధించింది. కాగా గ్రామంలో బాధితులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత నెలలో పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆరోజు ఇచ్చిన హామీ మేరకు ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు లక్ష వంతున సాయం అందజేశారు.