ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కిషోర్ పై ఏపి సీఐడీ గతంలో నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి తాజాగా లిఖిత పూర్వక ఉత్తర్వులు బయటపడ్డాయి. ఈడీబీ సీఈఓగా పని చేసిన కాలంలో కృష్ణకిషోర్ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని పేర్కొంది. కృష్ణకిషోర్ ఈడీబీ సీఈఓగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలతో వివిధ సెక్షన్ల కింద మంగళగిరి సీఐడీ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు.
ఏపిలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణ కిషోర్ ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. పరిశ్రమలు, మౌలిక వనసుతల శాఖ నుండి నివేదిక తెప్పించుకుని కేసు నమోదు చేసినట్లు అప్పుడు వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీఐడీకి సూచించిన ప్రభుత్వం.. విచారణ పూర్తి అయ్యే వరకూ అమరావతి విడిచి వెల్లకూడదని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయన పై సెక్షన్ 188, 403, 409, 120 బీ కింద సీఐడీ కేసు నమోదు చేసింది.
ఆ నేపథ్యంలో కృష్ణకిషోర్ తన సస్పెన్షన్ పై క్వాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్వాట్) స్టే ఇచ్చింది. ఆ తరువాత విచారణ జరిపిన క్వాట్ హైదరాబాద్ బెంచ్.. కృష్ణకిషోర్ పై సస్పెన్షన్ చెల్లదని తుది తీర్పు ఇచ్చింది. తదుపరి కృష్ణ కిషోర్ పై నమోదైన కేసులపై ఏపి హైకోర్టులో విచారణ జరిగింది. ఆ కేసులో ఆయనపై పెట్టిన సెక్షన్లు చెల్లవని కేసును క్వాష్ చేసింది. కృష్ణ కిషోర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా గానీ, లాభపడినట్లుగా గానీ ఎక్కడా ఆధారాలను సీఐడీ చూపలేదని తేల్చి చెప్పింది. దురుద్దేశపూర్వకంగా కృష్ణకిషోర్ పై కేసు పెట్టినట్లుగా ధర్మాసనం నిర్ధారిస్తూ.. భజన్ లాల్ కేసులో సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేసు కొట్టివేయదగినదిగా పేర్కొంది.