AP High court: రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకానికి మార్గం సుగమం అయ్యింది. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ మంగళవారం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీన పేదలందరికీ ఇళ్ల స్థలాల పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు విచారణ జరిపింది.
పిటిషన్ లలో 52 మందికి ఇంతకు ముందే ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. అయితే పిటిషనర్ లు ఈ విషయాన్ని కోర్టు తెలియజేయలేదు. వాళ్లకు ఇళ్లు మంజూరు చేసిన విషయాన్ని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో అర్హులైన వారికి ఇళ్లు కేటాయిస్తే చాలనీ, లోతైన విచారణ అవసరం లేదని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. అర్హులైన వారికి ఇళ్లు ఇస్తామని ఇంతకు ముందే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇళ్ల పట్టాల కోసం మూడు వారాల్లో వినతి పత్రం అందించేందుకు పిటిషనర్ కు వెసులుబాటు కల్పించింది. వినతి పత్రం అందజేసిన మూడు నెలల్లో జిల్లా కలెక్టర్ పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పూర్తిగా పక్కన పెట్టేసిన డివిజన్ బెంచ్.. తదుపరి విచారణను వాయిదా వేసింది. దీంతో ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.