AP High Court: నగేరా (ఎన్ఆర్ఈజీఎస్) చెల్లింపుల విషయంలో హైకోర్టు మరో సారి ఏపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ఆర్ఈజీఎస్ పెండింగ్ బిల్లులపై హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్ లను కలిపి గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ లపై విచారణ చేసింది. చెల్లింపులకు సంబంధించి పదేపదే హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆగస్టు 1వ తేదీలోపు నగేరా బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హజరై సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది.
బిల్లులు చెల్లించకపోతే ఆగస్టు 1న పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థిక శఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టుకు హజరుకావాలని ఆదేశించింది. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అమలు చేయడం లేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనానికి చెప్పారు. ఆగస్టు 1వ తేదీలోగా బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది.