AP High Court: ఏపి సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. పలు నిర్ణయాలకు ప్రజామోదం లభిస్తొంది. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ఏపిలో సంక్షేమ పథకాల పంపిణీ పాలన సాగుతోంది. సంక్షేమ పథకాల అమలునకు పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తొంది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అప్పులను సాధిస్తూ యథావిధిగా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ వస్తొంది జగన్ సర్కార్. అయితే ఏపి బేవరేజెస్ కార్పోరేషన్ కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్ధిక సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వం రుణం పొందే ప్రయత్నాలు చేస్తుండటంపై వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంలో ధర్మాసనం..పిటీషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేందుకు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లుగా అనిపిస్తొందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలు ఎలా చేయాలో చూసేందుకు తామేమీ కంపెనీ సెక్రటరీలము కాదు, హైకోర్టు న్యాయమూర్తులమని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులుగా తాము ఏమి చేయాలో రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందనీ, దాని ప్రకారమే నడుచుకుంటామనీ, ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదనీ తెలిపింది.
రుణం పొందకుండా ప్రభుత్వ యత్నాలను అడ్డుకోవాలన్న రఘురామ అభ్యర్ధనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యమేకాదని పేర్కొంది. ఈ పిటిషన్ పై ప్రభుత్వం నుండి కనీస వివరణ కూడా అడగమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామనీ, అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.