AP High Court: గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి వ్యవహారంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఎన్ఆర్ఐ డైరెక్టర్ లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, మణి అక్కినేని, రాఘవరావు తదితరులపై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నిన్న కేసు నమోదు చేసిన నేపథ్యంలో వీరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమపై కొందరు డైరెక్టర్ లు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారనీ, నేడు జరుగుతున్న బోర్డు మీడింగ్ కు హజరుకాకుండా అడ్డుకుంటున్నారని పిటిషన్ లో వీరు హైకోర్టుకు విన్నవించారు. హౌస్ మోషన్ పిటిషన్ ను విచారణ జరిపిన హైకోర్టు..పిటిషన్లపై ఎలాంటి తొందరపాటు చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. పిటిషనర్లను అరెస్టు చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
మరో పక్క ఎన్ఆర్ఐ ఆసుపత్రి డైరెక్టర్ లు కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ముక్కాముల అప్పారావు ఆధ్వర్యంలో గురువారం బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 19 మంది సభ్యులు పాల్గొనగా కొత్త కమిటీ అధ్యక్షుడుగా నరసరాజు, కార్యదర్శిగా సోము కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ గా పార్థసారధి, సంయుక్త కార్యదర్శిగా శ్రీధర్, కోశాధికారిగా సీటీ చౌదరిని ఎన్నుకున్నారు. పాత కమిటీ కాలంలో ఆర్థిక కార్యకలాపాల్లో అవకతవకలు జరిగాయని, వాటిని ఆడిట్ సంస్థతో విచారణ చేయిస్తామని కమిటీ సభ్యుడు అప్పారావు తెలిపారు. ఆసుపత్రిని ఎట్టిపరిస్థితుల్లనూ విక్రయించేది లేదని స్పష్టం చేశారు.