ఐపీఎస్ IPS అధికారి ఏబి వెంకటేశ్వరరావు AB Venkateshwara Rao కు ఏపి హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం (interim relief) లభించింది. ఏబి వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రెండు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఈ నెల (జనవరి) 18లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు జనవరి 18వ తేదీకి వాయిదా వేసింది.
గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించిన ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును జగన్మోహనరెడ్డి సర్కార్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత విచారణ కూడా జరుపుతోంది. తన సస్పెన్షన్ పై ఏబి వెంకటేశ్వరరావు క్యాట్ను ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఆ తరువాత ఏబివీ హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ జివోను రద్దు చేస్తూ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. దీంతో ఏబీవి సస్పెన్షన్లోనే ఉన్నారు.
ఈ తరుణంలోనే ఏపి ప్రభుత్వం తనను వేధింపులకు గురి చేస్తున్నదంటూ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ కు లేఖ రాశారు. అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. తనపై కేసులను నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది దీనికి సంబంధించి తన వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే అసోసియేషన్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే ఏబీవీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.