రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపి హైకోర్టు మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అమరావతి పరిధిలో 1100 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 169.27 ఎకరాలకు సంబందింఛి కొనుగోళ్ల కేసులో ప్రధాన నిందితుడుగా టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. నారాయణ ఆయన బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్లుగా ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రీసెంట్ గా సీఐడీ అయిదుగురురిని అరెస్టు చేసింది.
ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. నారాయణ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. నారాయణ అరోగ్య పరిస్థితి బాగోలేదనీ, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు. దిగువ కోర్టులో కూడా మిగతా నిందితులకు సెక్షన్లు వర్తించవని రిమాండ్ ను తిరస్కరించిన అంశాన్ని న్యాయవాది పోసాని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కేసులో నారాయణ కీలక నిందితుడని కావున ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దంటూ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బెయిల్ ఇవ్వకూడదన్న వాదనలు వినిపించారు. అయితే హైకోర్టులోనే మరో కేసులో నారాయణకు బెయిల్ ఇచ్చిందని న్యాయవాది పోసాని విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం .. మూడు నెలల పాటు నారాయణ విదేశాల్లో చికిత్స చేయించుకునేందుకు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read More: అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసులో అయిదుగురిని అరెస్టు చేసిన సీఐడీ