AP High Court: ఏపి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (ఉమ)కు బెయిల్ మంజూరు అయ్యింది. కృష్ణాజిల్లా జి కొండూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ యాక్ట్, హత్యాయత్నం తదితర సెక్షన్ ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో దేవినేని ఉమను అరెస్టు చేసిన పోలీసులు ఇటీవల కోర్టుకు హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు జరిగాయి. ఉమ పై అభియోగించిన కుల దూషణ, హత్యాయత్నం సెక్షన్లు వర్తింవని ఉమ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. బెయిల్ మంజూరుకు ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. నేడు హైకోర్టు ఉమకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ సాయంత్రానికి ఉమా రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల కానున్నారు.