Ap High Court: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపి హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. మాన్సాస్ ట్రస్ చైర్మన్ అశోక్ గజపతిరాజుతో సహా ట్రస్ట్ ఉద్యోగులపై ఇఓ ఫిర్యాదు మేరకు ఇటీవల విజయనగరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. దీనిపై అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపి హైకోర్టు ఇఓ ఫిర్యాదుపై నమోదైన కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
మాన్సాస్ ట్రస్ట్ ఇఓ వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల గత నెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజును కలిశారు. అనంతరం ఉద్యోగులు వేతనాల నిలుపుదల చేసినందుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. జీతాలు నిలిపివేతపై ఇఓ ను నిలదీశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఈఓకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఘటనపై ఇఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన, ఈఓ పై దాడికి ప్రేరేపించారన్న అభియోగాలతో అశోక్ గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.
Ap High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంచయిత
కాగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసిన నేపథ్యంలో అశోక్ గజపతిరాజు తిరిగి ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో సంచయిత నేడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అన్న అంశంపై ఈ నెల 10వ తేదీన హైకోర్టు విచారణ జరగనున్నది.