AP High Court : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లన్నింటినీ ధర్మాసనం తిరస్కరించింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ 16 పిటిషన్ లు దాఖలు అయ్యాయి. కొత్త ఓటరు లిస్ట్ ప్రకారం మున్సిపల్ ఎన్నికలు జరపాలంటూ పిటిషనర్లు కోరారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు గడచినందున తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గతంలో నామినేషన్లు వేయనీయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
పిటిషన్ లపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. పాత నోటిఫికేషన్ ప్రకరమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. యథావిధిగా మార్చి 10వ తేదీ పోలింగ్, 14 ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
ఏపిలో 12 మున్సిపల్ కార్పోరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ రీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చి 15న నిలిచిన ప్రక్రియ నుంచే కొనసాగించేలా ఎస్ఈసీ ఉత్తర్వులో పేర్కొంది.