YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్ విచారణ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ బెయిల్ పిటిషన్ విచారణలో తనను కూడా ఇంప్లీడ్ చేసుకోవాలంటూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి హైకోర్టును అభ్యర్ధించారు. ఈ మేరకు న్యాయవాదుల ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏ నిబంధన కింద ఇంప్లీడ్ అవుతారంటూ హైకోర్టు సునీతా రెడ్డి తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. పూర్తి వివరాలతో మరో పిటిషన్ దాఖలు చేస్తామని సునీత తరపు న్యాయవాదులు ధర్మాసనానికి విన్నవించారు. దీంతో పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
YS Viveka Case: బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శివశంకరరెడ్డిని గత ఏడాది నవంబర్ 17న సీబీఐ అధికారులు హైదరాబాద్ లో ఓ ఆసుపత్రిలో ఉండగా అరెస్టు చేశారు.వివేకా హత్య కేసులో మూడవ నిందితుడైన డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా శివశంకరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.ఆ తదుపరి ఆయనను కోర్టులో హజరుపర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తరువాత ఆయన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కేసు కీలక దశలో ఉన్నందున నిందితుడికి బెయిల్ మంజూరు చేయవద్దనీ, బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో జనవరి 17 హైకోర్టు శివశంకరరెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. తాజాగా మరో సారి శివశంకర్ రెడ్డి హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు.