AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బల పరంపర కొనసాగుతోంది. జగన్ సర్కార్ తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు కావడం, వాటిని హైకోర్టు తప్పుబడుతూ ఉత్తర్వులు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎయిడెడ్ కళాశాలల విషయంలోనూ ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎయిడెడ్ కళాశాలకు ఎయిడ్ నిలిపివేయడం, కళాశాలల స్వాధీనం పై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రైవేశాలు కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
ఎయిడెడ్ కళాశాలల్లో ప్రవేశాలు నిలిపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పిటిషన్ ల తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకురాగా తాము అటవంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై న్యాయవాది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆదేశాలను చదివి వినిపించారు. ప్రవేశాలను నిలిపివేస్తే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రవేశాలను నిర్వహించుకోవచ్చని యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల స్వాధీనం నోటిఫికేషన్ పై విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.