అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంబంధించి ఇరుపక్షాలకు ఏపి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ తో పాటు పాదయాత్ర కొనసాగింపులో ఆంక్షలు సడలించాలని, అడ్డంకులు లేకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటీషన్ల గత శుక్రవారం హైకోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. రైతుల పాదయాత్రకు సంబంధించి పిటిషన్లు అన్నింటినీ కలిపి గత శుక్రవారం విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు తీర్పు ఈ రోజు తీర్పు ఇచ్చింది.
విచారణ సందర్భంగా అమరావతి రైతుల తరపున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, ఉన్నం మురళీధర్ గతంలో కోర్టుకు తెలిపిన విషయాలతో పాటు మరికొన్ని అంశాలను తాజాగా విచారణలో ప్రస్తావించారు. యాత్రకు మద్దతుగా అయా ప్రాంతాలకు చెందిన వారు వస్తూ ఉంటారనీ, వారికి కూడా యాత్రలో పాల్గొన్న వారిగా పోలీసులు పరిగణిస్తున్నారని ఫిర్యాదు చేశారు. యాత్రకు మద్దతు తెలుపుతున్న వారు యాత్రకు ముందూ వెనుకా నడిచేలా అనుమతి ఇవ్వాలని కోరారు. యాత్రలో కోర్టు చెప్పినట్లుగా 600 మంది మాత్రమే పాల్గొంటామని, ఎవరైనా తొలగితే వారి స్థానంలో కొత్త వారు వచ్చేలా అనుమతి ఇవ్వాలని కోరారు. రైతుల పాదయాత్రను మంత్రులు అడ్డుకుంటామంటున్న నేపథ్యంలో వైసీపీ నేతల నుండి రక్షణ కల్పించాలని కోర్టుకు అభ్యర్దించారు. దీనిపై హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలనే కొనసాగుతాయని తెలిపింది. రైతుల విజ్ఞప్తిని తోసిపుచ్చింది హైకోర్టు. గుర్తింపు కార్డులు ఉన్న వారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని, సంఘీభావం తెలియడానికి వస్తున్న వాళ్లు రోడ్డుకు ఇరువైపులా ఉండి స్వాగతించవచ్చని తెలిపారు. నిబంధనల సడలింపునకు కోర్టు అంగీకరించలేదు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేస్తూ పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని రైతులకు క్లీయరెన్స్ ఇచ్చింది.
మరో పక్క రైతుల పాదయాత్రకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఏపి ప్రభుత్వం తరుపున ఏజి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాధ్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. రైతుల పిటిషన్లకు విచారణ అర్హత లేదని న్యాయవాదులు వాదించారు. పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని ఏజి కోరారు. గుడివాడలో పోలీసులపై దౌర్జన్యం చేయడం, ట్రాఫిక్ నిబంధనలు అమరావతి రైతులు ఉల్లంఘించారని ఏజి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాలు వీడియో టేప్ లను కోర్టుకు అందించారు. అయితే పాదయాత్ర అనుమతి రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇరుపక్షాలకు చుక్కెదురు అయినట్లు అయ్యింది. వైసీపీ నిరసనలు, పోలీసుల ఆంక్షల నేపథ్యంలో గత నెల చివరి వారంలో అమరావతి రైతుల పాదయాత్ర కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు అమరావతి నుండి అరసవెల్లికి పాదయాత్ర కొనసాగిస్తుండగా, పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు మూడు రాజధానులకు మద్దతుగా నల్ల బెలూన్లు, ప్లకార్డులతో అమరావతి రైతులకు నిరసన తెలియజేస్తున్నారు. ఈ పరిణామాలతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.