AP High Court: ఏపి సర్కార్ కు హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో సవరణలపై రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. గ్రామ సభలు నిర్వహించకుండా తమకు వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్ల తరపు వాదనలు విన్న హైకోర్టు.. మాస్టర్ ప్లాన్ సవరణలపై అమరావతి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు రోజుల వ్యవధిలో రాజధానిలోని 17 గ్రాామాల్లో గ్రామ సభలను నిర్వహించి అభిప్రాయాలను సేకరించాలని హైకోర్టు తెలిపింది. ఇప్పటి వరకూ మందడం, లింగాయపాలెం గ్రామాల్లో ప్రభుత్వం గ్రామ సభలను నిర్వహించగా, మిగిలిన గ్రామాల్లోనూ గ్రామ సభలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధానిలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా ఆర్ – 5 జోన్ ను ఏర్పాటు చేస్తూ ఈ నోటిఫికేషన్ తీసుకువచ్చింది. ఈ జోన్ ఏర్పాటు కోసం సీఆర్డీఏ చట్ట సవరణ చేస్తున్నట్లు పేర్కొంది. ఆర్ – 5 జోన్ పరిధిలోని అయిదు గ్రామాలకు చెందిన 900 ఎకరాలను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనిపై 15 రోజుల్లో అభ్యంతరాలు సీఆర్డీఏకి తెలియజేయాలంటూ నోటీసులు ఇచ్చింది. అయితే గ్రామ సభలు నిర్వహించకుండా నోటీసులు ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా.. పై విదంగా ఆదేశాలు ఇచ్చింది.