ఏపి ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను తరచు హైకోర్టు తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టడమే కాకుండా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా ఏపి ప్రభుత్వం.. అనంతరపురం జిల్లా కు చెందిన ఏపి బ్రాహ్మాణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ ను దేవాదాయ శాఖ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొంది. ఇప్పటికే ఏపి సర్కార్ లో గతంలో ఎన్నడూ లేని విదంగా నాలుగు డజన్లకు పైగా సలహాదారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో జే శ్రీకాంత్ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. జే శ్రీకాంత్ నియామక జీవోను నిలుపుదల చేస్తూ స్టే ఉత్తర్వలు ఇచ్చిన ధర్మాసనం .. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
సలహాదారులను నియమించుకునేందుకు అధికారుల కొరత ఏమైనా ఉందా అని ప్రశ్నించింది ధర్మాసనం. మంత్రులకు సలహాదారులు ఉంటే అర్ధం ఉంది గానీ, శాఖలకు సలహాదారులు ఏమిటని నిలదీసింది. ఇలా వదిలేస్తూ పోతే రేపు అడ్వొకేట్ జనరల్ కు కూడా సలహాదారుడిని నియమిస్తారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సలహదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తారని ఆక్షేపణ వ్యక్తం చేసింది.