ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలకు భావ ప్రకటన స్వేచ్చ వర్తించగా అని ఏపి హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుపై విచారణ జరిపిన న్యాయస్థానం .. తీర్పు రిజర్వు చేస్తూ ఉద్యోగ సంఘానికి తాత్కాలిక ఊరట నిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. రీసెంట్ గా ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేత కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో సంఘ ప్రతినిధులు .. ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును వివరిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సర్కార్ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన నోటీసుపై ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించగా, మంగళవారం పిటిషన్ ను విచారించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమస్యలపై మాట్లాడే భావ ప్రకటన స్వేచ్చ ఉద్యోగుల సంఘానికి లేదా..? సమస్యలపై పోరాడకూడదా..? రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిస్థితి ఏమిటి.. ? ఉద్యగుల సంఘానికి అధికరణ 19 వర్తించదా..? మీడియాతో మాట్లాడిన మాటల్లో ప్రభుత్వాన్ని కించపరిచినట్లుగా ఎక్కడుంది.. ? వారు ఏ నిబంధనను ఉల్లంఘించారో షోకాజ్ నోటీసులో పేర్కొనలేదు కదా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్, న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ న్యాయవాది వి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ .. షోకాజ్ నోటీసుపై అధికరణ 226 కింద దాఖలు చేసే పిటిషన్ కు విచారణార్హత లేదని చెప్పారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. షోకాజ్ నోటీసు పై సంఘ అధ్యక్షుడి సమాధానం ఆధారంగా తుది చర్యలు ఉంటాయని అన్నారు. ఉద్యోగ సంఘం వారి సమస్యలపై పోరాటం చేయడం, సంఘ ప్రతినిధులు గవర్నర్ కలవడం లో తప్పులేదనీ, అయితే ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కించపరుస్తూ మాట్లాడటం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి సంబంధించిన అంతర్గత, సున్నిత, కీలక సమాచారాన్ని మీడియా ముఖంగా బహిర్గతం చేశారనీ, దీనిపైనే తమకు అభ్యంతరమని అన్నారు. ఇది సర్వీసు నిబంధనలకు విరుద్దమని జీపీ పేర్కొన్నారు.
జీపీ వ్యాఖ్యలపై పిటిషనర్ సంఘ ప్రతినిధులకు భావ ప్రకటన స్వేచ్చ వర్తించదా అని అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి జీపీ బదులు ఇస్తూ భావ ప్రకటన స్వేచ్చ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు ఏది పడితే అది మాట్లాడటానికి వీలు లేదని, వారికి నియమావళి ఉంటుందని, దానికి లోబడే పని చేయాలని అన్నారు. సమయం ఇస్తే పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచుతామని జీపీ చెప్పారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ మద్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తీర్పును రిజర్వు చేశారు. తీర్పు ఇచ్చేంత వరకూ తుది నిర్ణయం తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన