AP High Court: అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల పాదయాత్రలో తాము పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి వేసిన పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతూ పాదయాత్ర ద్వారా కోర్టులపైనా ఒత్తిడి తెస్తారా అని ప్రశ్నించింది. పిటిషన్ లో పార్టీ కాని వారు అప్పీల్ ఎలా దాఖలు చేస్తారని రైతు పరిరక్షణ సమితిని హైకోర్టు ప్రశ్నించింది. రైతుల పిటిషన్ల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పాదయాత్రకు సంఘీభావం తెలపడం, తమ నిరసనను తెలియచేసే ప్రాధమిక హక్కును ఉపయోగించడమేనని అన్నారు.
రాజధాని అమరావతిలోనే ఉండాలని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని న్యాయవాది ఆదినారాయరావు తెలిపారు. మూడు రాజధానుల బిల్లు మళ్లీ తెస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిందన్నారు. పాదయాత్రకు పోటీగా రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాళ్లకు లేని ఆంక్షలు రైతులకు మాత్రమే ఎందుకని న్యాయవాది అన్నారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మూడు రాజధానులకు అనుకూలంగా, మరో వైపు అమరావతికి అనుకూలంగా పాదయాత్రలు చేయడం మంచిది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పాదయాత్ర అంశంపై సింగిల్ జడ్జ్ వద్దకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది. ఇప్పటికే సింగిల్ జడ్జ్ లు ఇరువురు తమ ఉత్తర్వులు వెల్లడించారని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. బాధిత పక్షం కోర్టుకు రావాలి కానీ వేరే వాళ్లు అప్పీలుకు రావడం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. అయితే తాము బాధితులకు సంఘీభావం తెలిపేందుకే పిటిషన్ వేశామని పిటిషనర్ తరపున న్యాయవాది ఆదినారాయణరావు తెలిపారు. రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హతపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. సవివరంగా కౌంటర్ దాఖలు చేస్తామని ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
అమరావతి రైతుల మహా పాదయాత్రపై ఏపి హైకోర్టులో ఇరుపక్షాలకు చుక్కెదురు