AP High Court: ఉద్యోగ సంఘాలకు షాక్ ఇచ్చేలా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల సమ్మెను నివారించాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు లంచ్ మోషన్ గా స్వీకరించి విచారించింది. ఉద్యోగుల సమ్మె, పెన్ డౌన్, ర్యాలీలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మన్మధరావు తో కూడిన ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టానికి విరుద్దంగా ఏమి జరిగినా దాన్ని నివారించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనీ, ఆ స్వేచ్చ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.
AP High Court: పరిపాలన సక్రమంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలి
పెన్ డౌన్ అయినా, సమ్మె అయినా అలాంటి కార్యక్రమాలు ఏమి చేసినా రూల్ 4 కింద నిషేదం ఉందని ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. అలాంటిప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ధర్మాసనం ప్రశ్నించింది. పరిపాలన సక్రమంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించలేకపోతుందని పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విజయవాడలో జరిగిన ర్యాలీకి ఎలా అనుమతి కోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. సోమవారం నాటికి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని హైకోర్టు తెలిపింది.