AP High court: ఏపి ప్రభుత్వం ప్రకటించిన నూతన పిీఆర్సీపై ఉద్యోగ సంఘాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏపి గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసి అధ్యక్షుడు కృష్ణయ్య పీఆర్సీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు ఉద్యోగ సంఘాలకు షాక్ ఇచ్చేలా కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గాయా పెరిగాయా చెప్పండని పిటిషన్ దారులను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి సమాచారం లేకుండా పిటిషన్ ఎలా వేస్తారని ప్రశ్నించిన హైకోర్టు.. అయినా పీఆర్సీని సవాల్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది. జీతాలు పెంచే అధికారం, అలానే తగ్గించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని వ్యాఖ్యానించింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకపోతే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది.
AP High court: పిటిషన్ దారులు హైకోర్టుకు హజరు కావాలి
స్టీరింగ్ కమిటీలోని 12 మంది సభ్యులు, పిటిషన్ దారులు హైకోర్టుకు హజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. తొలుత కోర్టులో ఇరువర్గాలు తమ తమ వాదనలు వినిపించాయి. విభజన చట్టం ప్రకారం హెచ్ఆర్ ఏ ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయలేదనీ, నోటీసు లేకుండా జీతాల్లో కోత విధించడం చట్ట విరుద్దమని, హెచ్ ఆర్ ఏ విభజన చట్టం ప్రకారం జరగలేదని న్యాయవాది వివరించారు. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని బెదిరించడమే కాకుండా కోర్టులో రిట్ పిటిషన్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు పెరిగాయని లెక్కలతో సహా కోర్టుకు వివరించారు ఏజీ. ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు.