AP High Court: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఆహ్వానితుల్లో నేర చరిత్ర గలవారికి చోటు కల్పించారంటూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేసు వాయిదా పై పిటిషనర్ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు వివరాలను ధర్మాసనానికి వివరించారు.ఈ సందర్భంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
AP High Court: నేర చరిత్ర గలవారిని బోర్డులో ఎలా నియమిస్తారు..?
టీటీడీ పాలకమండలిలో నేర చరిత్ర గల వారికి స్థానం కల్పించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేర చరితుల్ని బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. మీకు ఏదో లబ్ది జరగడం వల్లనే ఇలా చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనల్లో ప్రాధమిక సాక్ష్యాలు ఉన్నట్లు భావిస్తున్నామని పేర్కొంది. అందరినీ కాకపోయినా కొందరినైనా తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. టీటీడీకి చెందిన భవనాన్ని కలెక్టరేట్ అవసరాలకు వాడుకుంటే విధానపరమైన నిర్ణయం కాబట్టే సమర్ధించామని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది. కానీ నేర చరిత్ర ఉన్న సభ్యులు పాలక మండలిలో ఉండొద్దని తెలిపింది. ఏప్రిల్ 19న ఈ పిటిషన్ పై వాదనలు వింటామని పేర్కొన్న ధర్మాసనం.. అదే రోజు నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని పేర్కొన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది.