AP High Court: కరోనా సెకండ్ వేవ్ సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య (Anandaiah) కరోనా మందు ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆనందయ్య నాటు మందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం (AP Govt).. ఆయన తయారు చేసిన కంటి చుక్కల మందు (Eye Drops) పంపిణీకి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఆనందయ్య హైకోర్టు (AP High court)లో పిటిషన్ దాఖలు చేయగా నేడు విచారణ జరిపింది. తాను తయారు చేసిన కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆనందయ్య తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకున్నట్లు పిటిషన్ లో వివరించారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికరంగా వాదోపవాదాలు జరిగాయి.
AP High Court: ఆసక్తికరంగా వాదనలు
ఆనందయ్య అసలు ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేయగా, దీనిపై ఆనందయ్య తరపు న్యాయవాది ప్రభుత్వ న్యాయవాది వాదనను ఖండించారు. ప్రభుత్వానికి ఆనందయ్య చేసుకున్న ధరఖాస్తును, అందుకు ప్రభుత్వం వెల్లడించిన స్పందనను కోర్టుకు సమర్పించారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది తన వాదనలను కొనసాగిస్తూ ఆనందయ్య కంటి చుక్కల మందు ప్రమాదకరమని వెల్లడించారు. దీనిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆనందయ్య మందు కారణంగా ఎందరు చనిపోయారు. కరోనా వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందరు చనిపోయారు అంటూ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అంతే కాకుండా ఆనందయ్య ధరఖాస్తును ప్రభుత్వం వెంటనే పరిశీలించాలనీ, సాంకేతిక కారణాలు సాకుగా చూపి ధరఖాస్తును తిరస్కరించవద్దని పేర్కొంది.
హైకోర్టు జోక్యంతో ఆనందయ్య మందుకు అనుమతి
కరోనా సెకండ్ వేవ్ సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం ఆనందయ్య కరోనా మందు కోసం పెద్ద సంఖ్యలో కృష్ణపట్నం బాటపట్టారు. వందలాది మందికి ఆనందయ్య మందు పంపిణీ చేశారు. అయితే లోకాయుక్త ఆదేశాలు అంటూ ఆనందయ్య మందు పంపిణీని ప్రభుత్వ అధికారులు అడ్డుకోవడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రభుత్వం ఆనందయ్య మందుపై అధ్యయనానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయుష్, ఐసీఎంఆర్ నిపుణుల బృందం ఆనందయ్య మందుపై పరిశోధనలు జరిపింది. ఆ నేపథ్యంలో ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వం ఆయన మందు పంపిణీకి అనుమతి ఇచ్చింది. అయితే కంటి చుక్కల మందుకు మాత్రం ఇంత వరకూ అనుమతి ఇవ్వలేదు. ఈ తరుణంలో మరో సారి ఆనందయ్య హైకోర్టు ను ఆశ్రయించగా నేడు కీలక ఆదేశాలు ఇచ్చింది.