మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ పై నమోదు అయిన అమరావతి ప్రాంత మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసు విచారణలో హైకోర్టు స్వల్ప ఊరట కల్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నారాయణ, ఆయన భార్య రమాదేవితో పాటు నారాయణ సంస్థల ఉద్యోగి ప్రమీలను ఇంటి వద్దనే విచారించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో అవకతవకలకు పాల్పడ్డారని నారాయణ, మరి కొందరిపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసు విచారణకు హజరుకావాలని ఈ నెల 6వ తేదీన నారాయణ దంపతులు సహా కంపెనీ ఉద్యోగి ప్రమీలకు సీఐడీ నోటీసులు ఇచ్చింది.
విచారణకు గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొంది. ఈ నోటీసులపై నారాయణ తరపు మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. మహిళలను ఇంటి వద్దనే విచారించాలని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పూలను ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు దమ్మాలపాటి. అదే విధంగా నారాయణను ఇంటి వద్దనే విచారించాలని గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. నారాయణ తరపు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పిటిషనర్లను ఇంటి వద్దనే విచారించాలని ఆదేశాలు ఇచ్చింది.
కాగా ఇదే వ్యవహారంలో నారాయణ కుమార్తెలు సింధూర, షరిణిలకు సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసింది. వారితో పాటు అల్లుడు పునీత్, నారాయణ సంస్థల ఉద్యోగి వరుణ్ కుమార్ ను మార్చి, 7,8 తేదీల్లో దర్యాప్తు సంస్థ అధికారులు గుంటూరులో విచారించనున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నారాయణను ఇప్పటికే పలు మార్లు సీఐడీ అధికారులు విచారించారు.
AP CM YS Jagan: ఏపీకి రూ.13లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?