AP High Court: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదాస్పదం అయిన నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కౌన్సిల్ హాలులో నిన్న, ఈ రోజు జరిగిన పరిణామాలతో రిటర్నింగ్ అధికారి చైర్మన్ ఎన్నికల ప్రక్రియను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విజయవాడ సీపీ, కొండపల్లి కమిషనర్ కోర్టుకు హజరై వివరణ ఇవ్వాలని కోరారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఆందోళన నేపథ్యంలో రెండవ రోజు మంగళవారం కూడా చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. నిన్న వైసీపీ కౌన్సిల్ హాలులో గొడవ చేసిన నేపథ్యంలో ఎన్నికల అధికారి ఎన్నికను నేటికి వాయిదా వేశారు.
ఎన్నికను నిరవధికంగా వాయిదా వేసిన రిటర్నింగ్ అధికారి
ఈ రోజు కూడా వైసీపీ సభ్యులు కౌన్సిల్ హాలులో ఎంపి కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. దీంతో ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎంపీ కేశినేని నానితో సహా టీడీపీ సభ్యుడు 14 మంది, ఇండిపెండెంట్ సభ్యుడు ఓ పక్క కూర్చోగా వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కౌన్సిల్ హాలులోకి వచ్చారు. కౌన్సిల్ హాలులో గొడవ అనంతరం వీరు వాకౌట్ చేశారు. మరో పక్క కొండపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీకి 14 – 14 కౌన్సిలర్ లు గెలుచుకోగా గెలిచిన మరో స్వతంత్ర అభ్యర్ధిని టీడీపీలోకి చేరిపోయారు. దీంతో హైకోర్టు ఆదేశాలతో ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు విజయవాడ టీడీపీ ఎంపి కేశినేని నాని పాల్గొనగా వైసీపీ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు.
AP High Court: రేపు ఎన్నిక నిర్వహించాలి
హైకోర్టులో టీడీపీ తరుపున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఎన్నిక జరగకుండా వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టించారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు (బుధవారం) ఎన్నిక నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశిస్తూ..దీనికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని ఎస్ఈసీకి స్పష్టం చేసింది. ఎన్నికైన అభ్యర్ధులకు రక్షణ కల్పించాలని విజయవాడ సీపీకి హైకోర్టు ఆదేశించింది. ఎన్నిక ఫలితాన్ని ప్రకటించవద్దనీ, వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.