AP High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎస్ఈసీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జడ్పిటిసి, ఎంపిటిసి ఎకగ్రీవాలపై ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
ఏకగ్రీవాలపై హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపిటిసి, జడ్ పీటీసీ నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న ఎస్ఈసీ అదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్పిటీసీ, ఎంపిటిసిలకు తక్షణమే అధికారికంగా ప్రకటించాలని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్ఈసీకి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఇంతకు ముందు ఎస్ఈసీ వాటిపై విచారణకు ఆదేశించింది. ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేడు తుది తీర్పు వెలువరించింది.