AP High Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశించింది. అదే విధంగా అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
AP High Court: మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలి
భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచి ప్లాట్లను అప్పగించాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటిని ఆ భూములను తనఖా పెట్టడానికి కూడా వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలనీ, మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని పేర్కొంది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని చెప్పింది. అమరావతి నుండి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదనీ, పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేల వంతున చెల్లించాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే..
రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన సీఆర్డీఏ రద్దు చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ చట్టాలను సవాల్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులతో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ లపై విచారణ కొనసాగుతుండగానే ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసినందున ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లు అన్నీ నిరర్ధకం అవుతాయనీ, వాటిపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు.
తీర్పుతో అమరావతి రైతుల్లో హర్షాతిరేకాలు
అయితే మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన పిటిషన్ లలో కొన్ని అభ్యంతరాలు మిగిలే ఉన్నాయనీ, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ల తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. ఫిబ్రవరి నాల్గవ తేదీన ఈ పిటిషన్లపై ఇరపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసిన త్రిసభ్య ధర్మాసనం నేడు కీలక తీర్పును వెల్లడించింది. ఈ తీర్పుతో అమరావతి ప్రాంతంలోని రైతులు హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.